సింగపూర్: ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి, సౌభాగ్యానికి కట్టుబడి ఉన్నామని భారత ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. సింగపూర్లో నిర్వహించిన 13 వ తూర్పు ఆసియా సదస్సులో పాల్గొన్న మోడీ తూర్పు ఆసియా సభ్య దేశాలతో బహుళ సహకారం, ఆర్థిక, సాంస్కృతిక బంధాలు మరింత పెంచుకోవడానికి కృషి చేస్తామని తెలిపారు. తూర్పు ఆసియా సమిట్ ( ఇఎఎస్ )లో మోడీ పాల్గొనడం ఇది ఐదవసారి. సింగపూర్లోని ఈస్ట్ ఆసియా సమిట్లో తన ఆలోచనలను పంచుకున్నానని, దీనిలోని సభ్య దేశాలతో సంబంధాలను పెంచుకుంటామని మోడీ చెప్పారు.
ఇఎఎస్ లో ఆసియా దేశాలైన ఇండోనేషియా, థాయ్లాండ్ సింగపూర్, మలేషియా, ది పిలిప్పీన్స్, వియత్నాం, మయన్మార్, కంబోడియా, బ్రూని, లావోస్ ఉన్నాయి.వీటితోపాటు ఆస్ట్రేలియా, చైనా, ఇండియా, న్యూజిలాండ్, దక్షిణ కొరియా, రష్యా, అమెరికా సభ్య దేశాలుగా ఉన్నాయి.సముద్రమార్గంలో సహకారాన్ని మరింత పెంచుకోవడానికి కట్టుబడి ఉన్నామని, ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం ( ఆర్సిఇపి ) కొరకు కట్టుబడి ఉన్నామని మోడీ చెప్పారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రవీష్ కుమార్ తెలిపారు.
ఆర్సిఇపిలో 10 దేశాలున్నాయి. అవి ఇండోనేషియా, థాయ్లాండ్ సింగపూర్, మలేషియా, ది పిలిప్పీన్స్, వియత్నాం, మయన్మార్, కంబోడియా, బ్రూని, లావోస్. తూర్పు ఆసియా సమిట్లో పాల్గొన్న మోడీ జపాన్ ప్రధాని షింజో అబెతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆసియన్, ఇండియా మధ్య గట్టి సంబంధాలు ఉండటం సంతోషకరమని మోడీ అన్నారు.