పేద వికలాంగులకు చౌకైన కృత్రిమ కాలు… పత్తి నుంచి ప్రత్యామ్నాయ ఇంధనం… మైనంతో మిసైల్స్ను నడిపించే సాధనం… ఇవన్నీ ఆయన ఆలోచనల నుంచి వచ్చినవే. ఇటీవలే ఫోర్బ్ మ్యాగజైన్ సంస్థ ప్రకటించిన యువ శాస్త్రవేత్త జాబితాలో గోరకవి ప్రవీణ్ కుమార్ చోటు సంపాదించుకున్న విషయం తెలిసిందే. ఫోర్బ్ మ్యాగజైన్ ప్రకటించిన 24 ఆసియా పసిఫిక్ దేశాల్లోని 30 ఏళ్లలోపు శాస్త్రవేత్తలను గుర్తించి అవార్డులు అందించేందుకు భారతదేశంలో వివిధ రంగాల నుంచి 59 మందిని ఎంపిక చేసింది. అందులో హెల్త్ అండ్ సైన్స్ విభాగంలో యంగ్ సైంటిస్ట్ గా ప్రవీణ్ ఎంపికయ్యాడు. తక్కువ ఖర్చుతో తేలికైన కృత్రిమ అవయవాలు (మోకాలు, కాలి మడమలు కూడా తిప్పడానికి అనువైన ఆర్టిఫిషియల్ లింబ్) రూపొందించినందుకుగాను ఆయనకు ఈ అరుదైన గౌరవం దక్కింది. దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం చేతుల మీదుగా ‘బాలశ్రీ’ అవార్డు అందుకున్న గోరకవి 29 ఏళ్లలో ఎన్నో ఆవిష్కరణలు చేశాడు. ఇరవై రెండేళ్లకే ఫ్యాప్సీ (ఆంధ్రప్రదేశ్ వాణిజ్య పరిశ్రమల సమాఖ్య) ఎక్సలెన్స్ అవార్డు సొంతం చేసుకున్నాడు. జిల్లా, రాష్ట్రస్థాయి నుంచి మొదలుకుని జాతీయ, అంతర్జాతీయస్థాయి వరకు అనేక అవార్డులు అందుకున్నారు.
ప్రవీణ్కుమార్ ఇప్పటివరకు 28 ఉత్పత్తులను కనిపెట్టాడు. వాటిలో కొన్ని సామాన్య ప్రజల కోసం రూపొందించాడు. ప్రస్తుతం యువ శాస్త్రవేత్తల బృందంతో కలిసి ఫై ఫ్యాక్టరీ పేరుతో అతి తక్కువ బరువైన కాటన్ బాక్స్లను రూపొందిస్తున్నాడు. దీనివల్ల చెట్లను వినియోగించకుండా పర్యావరణాన్ని కాపాడగలుగేందుకు అవకాశముంటుంది. ఫీ ఫ్యాక్టరీ స్టార్టప్ వల్లే ఫోర్బ్ పురస్కారం లభించిందన్నాడు. ఇదో గొప్ప గుర్తింపు, ప్రోత్సాహం, బాధ్యత కూడా అని అన్నాడు. అమ్మానాన్న, గురువుల ప్రోత్సాహంతోనే తాను ఈ స్థితికి చేరుకోగలిగానని మనతెలంగాణ ప్రతినిధికి తెలిపాడు. పేద వికలాంగుల కోసం అయిదు వందల రూపాయలు మాత్రమే ఖర్చయ్యే కృత్రిమ కాలు రూపొందించాడు. డ్యురాలమిన్, మెలానిన్ మిశ్రమంతో తయారు చేసిన దీన్ని అబ్దుల్కలాం సైతం మెచ్చుకున్నారు. పెద్ద మొత్తంలో డబ్బులిస్తామని ఓ కంపెనీ ముందుకు వచ్చినా కాదనుకుని పేదలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ టెక్నాలజీని అప్పటి ఆంధ్రప్రదేశ్ వికలాంగుల కోపరేటివ్ కార్పొరేషన్కి ఉచితంగా ఇచ్చాడు.
అక్కడి నుంచి అది ‘నిమ్స్’కు చేరింది. ఇంకా తన గురించి చెబుతూ..“ఓ.యూ.లో కెమికల్ ఇంజనీరింగ్ చదివాను. ఇప్పటివరకూ 100 ఇన్నోవేషన్స్ చేస్తే అందులో 28 ఇన్నోవేషన్స్ అమెరికా, యూరప్ దేశాలకి అమ్మాను. భారతీయుడిగా పెద్ద దేశాలకు ఇన్వెన్షన్స్ అమ్మటం గొప్ప అనుకున్నా. 250 రంగులనిచ్చే నెయిల్ పెయింటర్ పెన్ను కనుగొన్నాను. నా గొప్ప విజయం, పరాజయం కూడా అదే. దాన్ని ఓ సంస్థకి అమ్మేస్తే ‘నెయిల్ పాలిష్ సీసాలను అమ్మితే లాభం. ఇదెందుకూ? అని నా టెక్నాలజీని పక్కనబెట్టింది. ఇలాంటి కష్టాలు, గుణపాఠాలెన్నో తగిలాయ”న్నాడు. అన్నీ మంచికే అనుకుని ప్రస్తుతం మన దేశం కోసమే టెక్నాలజీని తయారు చేయాలని నిర్ణయించుకున్నామన్నాడు. కార్బన్ ఫైబర్ టెక్నాలజీ మీద పనిచేస్తున్నాడిప్పుడు. దీంతో రాకెట్స్ చేయనున్నామని, ప్రైవేటు రాకెట్లను తయారు చేయటంలో ఆసియా నుంచి తొలి ఏవియేషన్ స్టార్టప్ తమదే అవుతుందంటున్నాడు. తాను వాణిజ్యపరంగా మూడు ఇన్నోవేషన్స్ కనుగొంటే.. వాటిలో కనీసం ఒకటి సమాజానికి ఉపయోగపడాలన్నదే తన లక్ష్యమంటున్నాడు. జర్మనీలో శాస్త్రవేత్తలు నడుస్తుంటే వాళ్లతో జనాలు ఫొటోలు, సెల్ఫీలు దిగుతారు. మన దగ్గర కూడా శాస్త్రవేత్తల్ని గుర్తించే రోజు రావాలని కోరుకుంటున్నాడు.
ఫీ ఫ్యాక్టరీ: “మన దేశంలోని చిన్న, మధ్యతరగతి పరిశ్రమలకు ప్రపంచస్థాయి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తేనే మంచి ఉత్పత్తులు వస్తాయి. దేశ ఆర్థికవృద్ధి కలుగుతుంది. మా ఫీ ఫ్యాక్టరీ స్టార్టప్.. సాంకేతికతను అమ్మటం, పంచటమే కాదు.. ప్రతిభ ఉన్న ఐడియాలను వెతికి.. ఇన్పుట్స్ ఇచ్చి, ప్రోత్సహించి చిన్న,మధ్యతరగుతి పరిశ్రమలకు టెక్నాలజీ అందేట్లు చేస్తుంది. సమాజం చైతన్యంగా, సౌకర్యవంతంగా ఉండాలంటుంది సైన్సు. మా ఫీ ఫ్యాక్టరీ స్టార్టప్ ఉద్దేశం కూడా ఇదే. మేం ఇటీవలే జీఎఫ్పీ (గోరకవి ఫిల్లర్ పార్టికల్స్) అనే పౌడర్తో ప్యాకేజింగ్లో ఉపయోగపడే బ్రౌన్ పేపర్ను తయారు చేశాం. ఇది గట్టిగా, తేలికగా ఉంటుంది. వాస్తవానికి ఈ టెక్నాలజీని పండ్లరసాల సంస్థల ప్యాకేజ్లకి అమ్మొచ్చు. మేం అలా చేయలేదు. దేశంలోని 45 చిన్న, మధ్య తరగతి పరిశ్రమలతో ఒప్పందం కుదుర్చుకున్నాం. మా స్టార్టప్ కేవలం నాలుగు నెలల సమయంలోనే 200 విశ్వవిద్యాలయాలతో అనుసంధానమైంది. ఇప్పటికే రూ. 28 కోట్ల వ్యాపారం చేశాం. ఇలా టెక్నాలజీతో అందరికీ లాభం చేకూరాలి. అనతికాలంలోనే ఈ స్టార్టప్ని ఫోర్బ్స్ గుర్తించడం ఎంతో ఆనందదాయకం” అంటూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాడు.
రోబో: “రెండో తరగతి నుంచే మానాన్న కొనిచ్చిన బొమ్మల్ని విడగొట్టి వాటి విడిభాగాలతో ప్రయోగాలు చేసేవాణ్ణి. బొమ్మలు పోయినా ఇంట్లో తిట్టలేదు. అప్పట్లో నేను చేసిన బుల్లి ఇన్నోవేషన్స్ నాకు ఇంకా గుర్తున్నాయి. మా ప్రిన్సిపాల్ అయితే ఉపయోగం లేని వస్తువుల్నిచ్చి వాటితో పనికొచ్చేవి చేయమనేవారు. ఆరోతరగతిలోనే సొంతంగా రోబోలు తయారు చేశా”అంటూ గతాన్ని నెమరువేసుకున్నాడు ప్రవీణ్.
ఇల్లే గొప్ప ప్రయోగ శాల: “ ఇంటినే ప్రయోగశాలగా ఉపయోగించుకునే వాడిని. ఇంట్లో చిన్న డేరా వేసుకుని, అందులోనే పడుకునేవాణ్ణి. దానికి రోబోను కూడా కాపాలా పెట్టుకునే వాడిని. ఒకరోజు ఎ.డి., బి.సి అంటే ఏమిటి అని మా నాన్నను అడిగా. ‘ఆఫ్టర్ డెత్.. బిఫోర్ క్రైస్ట్’ అని చెప్పారు. ‘అలాగైయితే క్రీస్తు జీవించిన 32 ఏళ్లు ఏమయ్యాయని అడిగా. నాన్న వెంటనే ఓ.యూ. చరిత్ర విభాగానికి కాల్ చేసి కనుక్కుని ఎ.డి అంటే ‘అన్నో డొమినీ (జీసస్ పుట్టినప్పటి నుంచీ అని అర్థం)’ అని జవాబిచ్చారు. ‘క్రీస్తు పుట్టింది జనవరి 1 తేదీ కావాలి కదా.. మరి డిసెంబరు 25న పుట్టినరోజెందుకు చేసుకుంటున్నాం? మధ్యలో ఆరు రోజులేవీ’? అని ప్రశ్నించా. ఎవరూ సమాధానం చెప్పలేకపోయారు. తెలుసుకోవాలనే ఆసక్తితో ప్రపంచంలోని 30 రకాల క్యాలెండర్లు పరిశీలించా. అన్నిచోట్లా ఏదో గందరగోళం. దీంతో మొదట 150 సంవత్సరాలు.. తర్వాత రెండువేల సంవత్సరాలు.. చివరగా 40వేల సంవత్సరాల క్యాలెండర్ రూపొందించా. ఇదో వరల్డ్ రికార్డు.
నేనప్పుడు ఎనిమిదో తరగతి, వయసు పన్నెండేళ్లు. ఆ తర్వాత అంధుల కోసం 30వేల సంవత్సరాల క్యాలెండర్ను బ్రెయిలీలో చేశాను. ఆ క్యాలెండర్ కార్యక్రమానికి వచ్చిన దివ్యాంగులను చూసి బాధపడ్డా. కొందరు కృత్రిమకాళ్లు అమర్చుకున్నారు. కానీ అవి అంత అనువుగా లేవని అనిపించింది. దీంతో డ్యురాలమిన్ అనే పదార్థంతో చవకైన, తేలికైన కృత్రిమకాలును తయారు చేశాను. అది మోకాలు, మడమల దగ్గర వంగేలా ఉండటం గమనార్హం. దీంతో 20 కి.మీ.వేగంతోనైనా పరుగెత్తొచ్చు. ఓ రోజు ఇంట్లో ఎవరూ లేనపుడు కొవ్వొత్తి మైనాన్ని బాగా వేడిచేశాను. అది కరిగి కరిగి చివరికి భగ్గుమని మండిపోయింది. మైనంతో రాకెట్ ఇంధనం చేయచ్చనే ఆలోచన దీని నుంచే పుట్టుకొచ్చింది. అదే సమయంలో అబ్దుల్ కలాంగారి చేతుల మీదుగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ‘బాలశ్రీ’ అవార్డును అందుకోవటం మర్చిపోలేని అనుభూతి. నా ప్రయోగాలు చూసి.. బాలశాస్త్రవేత్త, బాలమేధావి అనేవారు. అప్పుడప్పుడూ కలాంగారితో ఉత్తరప్రత్యుత్తరాలు కూడా చేస్తుండేవాడిని” అని అంటున్నాడు ప్రవీణ్.
కమర్షియల్ ఇన్నోవేషన్స్: గోరకవి అనేక కమర్షియల్ ఇన్నోవేషన్స్ను ఆవిష్కరించాడు. ఇందులో ప్రధానంగా 40 వేల సంవత్సరాల క్యాలెండర్, 30వేల సంవత్సరాల బ్రెయిలీ క్యాలెండర్, కృత్రిమ కాలు తక్కువ ఖర్చుతో ఫుడ్ ప్రిజర్వేటర్, బ్రెయిలీ టైప్రైటర్ను అందుబాటులోకి తీసుకొచ్చాడు. అలాగే సె్పైనల్ రీస్టోరేషన్ (ఎముకలు విరిగిపోయినపుడు ఇంజక్షన్ ఉపయోగించి సెట్ చేయడం), అతి తక్కువ ధరలో నీళ్ల ఫ్యూరిఫికేషన్ టెక్నాలజీ, ప్రపంచమంతా అంతరించిపోతే విత్తనాల్ని కాపాడే టెక్నాలజీ, ప్యాకెట్స్లో ఫోమ్లా ఉండే దోశపిండి, బయోఇథనాల్ క్యాటలిస్ట్ పత్తి నుంచి బయోడీజిల్, ప్రస్తుతం అగ్రికల్చర్ వేస్ట్ నుంచి ఏవియేషన్ ఫ్యూయల్ చేస్తున్నారు. మైనంలోని మాలిక్యూల్స్ను మండించి ఉత్పత్తి అయ్యే శక్తిని రాకెట్, మిస్త్స్రల్ ఇంధనంగా వాడుకునేలా మరో టెక్నాలజీ రూపొందించాడు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ’నాసా’తో కలిసి ఓ ప్రాజెక్టుకు పనిచేశాడు.
కె. శ్రీనివాస్, స్టేట్బ్యూరో రిపోర్టర్
ఫొటోలు : రామగోని పరమేశ్వర్
Hyderabad scientist Praveen Kumar Gorakavi joins Forbes list
The post నిత్య పరిశోధనల ‘ప్రవీణు’డు! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.