వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ 100 సీట్లు మావే
కాంగ్రెస్ కంచుకోటలు
బద్దలు కొడతాం
దద్దమ్మలని కెసిఆర్ తిట్టలేదని
వారికి బాధగా ఉంది
తెలంగాణ భవన్లో కామారెడ్డి
కాంగ్రెస్ నేతలను పార్టీలో
చేర్చుకుంటూ ఎన్నికల రథంపై
నుంచి మంత్రి కెటిఆర్
మన తెలంగాణ/ హైదరాబాద్ : వచ్చే ఎన్నికల్లోనూ సెంచరీ కొడతామని, కాంగ్రెస్ కంచుకోటలను బద్దలు చేస్తామని మంత్రి కెటిఆర్ వ్యాఖ్యానించారు. టిఆర్ఎస్ సృష్టించే ఓట్ల సునామీలో కాంగ్రెస్ పార్టీ కొట్టుకుపోవడం ఖాయమన్నారు. ఆ పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రావన్నారు. మంగళవారం తెలంగాణ భవన్లో మంత్రి కెటిఆర్ సమక్షంలో కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ఎంపిపి ఎల్. నర్సింగ్రావుతో పాటు పెద్దఎత్తున ఆ పార్టీ నేతలు టిఆర్ఎస్లో చేరారు. నాగర్కర్నూల్ శాసనసభ్యుడు మర్రి జనార్దన్రెడ్డి రూపొందించిన ఎన్నికల ప్రచార రథంపై నుంచి మంత్రి కెటిఆర్ ప్రసంగించారు. ఎన్నికలు వచ్చినట్లుగా అనిపిస్తోందన్నారు. ఉదయం ఇంటి నుంచి తప్పిపోయి సాయంత్రం తిరిగి వచ్చినట్లుగా, గతంలో టిఆర్ఎస్ను వీడి తిరిగి సొంతగూటికి చేరుకుంటున్న కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. అనంతరం కెటిఆర్ తనదైన శైలిలో మరోసారి కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. ప్రగతి నివేదన సభలో దద్దమ్మలు, సన్నాసులు అని సిఎం కెసిఆర్ తిట్టనందుకు కాంగ్రెస్ నేతలు తెగ బాధ పడిపోతున్నారని ఎద్దేవా చేశారు. ప్రగతి నివేదన సభ లో టిఆర్ఎస్ ప్రభుత్వం నాలుగేళ్ళలో సాధించిన విజయాలనే కెసిఆర్ ప్రజలకు వివరించారన్నారు. అలాంటి సభపై చింత చచ్చినా పులుపు చావలేదన్నట్లుగా కాంగ్రెస్ నేతలు పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారని కెటిఆర్ విమర్శించారు. టిఆర్ఎస్ విధానాలు నచ్చి 40 ఏళ్లుగా కాంగ్రెస్లో ఉన్న నేతలు మా పార్టీలో చేరుతున్నారని పేర్కొన్నారు. నర్సింగ్రావు చేరికతోమాచారెడ్డిలో కాంగ్రెస్కు కనీసం జెండాలు కట్టేవారు కూడా లేకుండా పోయారన్నారు. ఇక షబ్బీర్అలీ తన జెండాలను తానే కట్టుకోవాల్సిందేనని కెటిఆర్ పంచ్లు విసిరారు.
రాహుల్ను చూసి టిఆర్ఎస్ భయపడుతుందా.. : కెటిఆర్
రాహుల్గాంధీ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్లోని అమేథి నియోజకవర్గంలో సమాజ్వాదీ పార్టీ దయతో గెలుస్తున్నారన్నారని, ఆ నియోజకవర్గం పరిధిలో జరిగిన ఎన్నికలో మున్సిపాలిటీని కూడా గెలుపించుకోలేని రాహుల్ను చూసి టిఆర్ఎస్ భయపడుతుందా అని కెటిఆర్ ప్రశ్నించారు. అలాంటి రాహుల్ తెలంగాణలో పదిసార్లు పర్యటించినా టిఆర్ఎస్ను ఏ మాత్రం కదలించలేరన్నారు. కూట్లో రాయి తీయలేని రాహుల్ ఏట్లో రాయి తీస్తాడా అని వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా తెలంగాణలో మళ్లీ అధికారంలోకి వచ్చేది టిఆర్ఎస్ పార్టీయేనని ధీమా వ్యక్తంచేశారు. కాంగ్రెస్లో అందరూ సిఎం అభ్యర్ధులేనని, ఎవరిని చూసి ప్రజలు ఓటెయ్యాలని ప్రశ్నించారు. కేవలం కాంగ్రెస నేతల కుటుంబాలే రాజకీయాల్లో ఉండాలా? తెలంగాణకు కెసిఆర్ కుటుంబం వల్ల ఏం అన్యాయం జరిగిందో చెప్పాలని కెటిఆర్ డిమాండ్ చేశారు.
గంప గోవర్ధన్ను మరోసారి భారీ మెజార్టీతో గెలిపించండి
కామారెడ్డి నియోజకవర్గం నుంచి ప్రస్తుత శాసనసభ్యుడు గంప గోవర్ధన్ను మరోసారి భారీ మెజార్టీతో గెలిపించాలని కెటిఆర్ పిలుపునిచ్చారు. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేశానో భవిష్యత్తుల్లో కామారెడ్డిని కూడా పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసే బాధ్యత తనదేనని కెటిఆర్ హామీ ఇచ్చారు.