సుధీర్బాబు హీరోగా సుధీర్బాబు ప్రొడక్షన్స్ బ్యానర్లో ఆర్.ఎస్.నాయుడు దర్శకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘నన్ను దోచుకుందువటే’. ఇటీవల విడుదలైన టీజర్, ట్రైలర్లకు మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా యూత్కు బాగా కనెక్ట్ అయింది ట్రైలర్. సినిమాలో ఆఫీస్ మొత్తం భయపడే సాఫ్ట్వేర్ కంపెనీ మేనేజర్గా సుధీర్బాబు నటించగా… అల్లరి చేసే గడుసమ్మాయి సిరి పాత్రలో హీరోయిన్ నభా నటేశ్ నటించింది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రాన్ని ఈనెల 21న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు ఆర్.ఎస్.నాయుడు మాట్లాడుతూ “సినిమా ట్రైలర్కు అద్భుతమైన స్పందన వస్తోంది. సమ్మోహనం వంటి హిట్ మూవీ తర్వాత సుధీర్బాబు నుంచి వస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. సుధీర్బాబు ఎక్కడా రాజీపడకుండా సినిమా నిర్మించారు. ఈ స్టోరీ చాలా ఫ్రెష్గా ఉంటుంది. కొత్త హీరోయిన్ అయినప్పటికీ నభా నటేశ్ చాలా బాగా చేసింది”అని అన్నారు. సుధీర్బాబు మాట్లాడుతూ “ఈ సినిమాను ఈనెల 21న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నాం. దర్శకుడు ఆర్.ఎస్.నాయుడు మంచి కథ, స్క్రీన్ప్లేతో సినిమా రూపొందించాడు”అని తెలిపారు. నాజర్, తులసి, వేణు, రవివర్మ, జీవా, వర్షిణి, సౌందర రాజన్, సుదర్శన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరాః సురేష్ రగుతు, మ్యూజిక్ః అజనీష్ బి.లోకనాథ్, ఎడిటర్ః ఛోటా కె.ప్రసాద్, ఆర్ట్ః శ్రీకాంత్ రామిశెట్టి.